Wednesday, March 24, 2010

నాడు -నేడు

వీధి కోడి గొంతెత్తి కూసి లేపేను పొద్దు పొడిచేనని నాడు
'శుక్లంబరదరం' అంటూ శ్లోకాన తట్టి లేపేను గడియారము నేడు

గరకు ఎర్ర పోడుముల రుద్ది పళ్ళు తోమేము నాడు
పెక్కు కాసులు పోసి రంగు లేహ్యాలు పూసి కడిగేము నేడు

తరవాణి,చలిది వన్నాల చల్లంగా కడుపు నిమ్పేము నాడు
వెన్న రొట్టెలు, ఇడ్లి ఉప్మాలు విధిగా అల్పాహారం అయ్యెను నేడు

ఆకు చెప్పులు, చిరుగు చొక్కాలు వేసి దుమ్ము దూగర నడిచి చేరేము పాటశాల నాడు
నల్ల బూట్లు తొడిగి,తెల్ల దుస్తులతో బస్సు ఎక్కి వెడలేరు కాన్వెంటుకు నేడు

సైకిలెక్కి మండు ఎండన చెమట చొక్కాల అలసి చేరేము కార్యాలయము నాడు
సూటు బూట్లు వేసి మోటారు నందు చల్లంగా వెడలేము ఆఫీసు కు నేడు

రెండు వారాలలో ఖర్చాయే జీతము అప్పిచ్చు వాడె కరువాయే నదియె చింత నాడు
ధనము లేకున్నా క్రెడిట్ కార్డులు ఉన్నవి చెంత భయమేల యిక నేడు

ఒంటి గది వాటాల యందు కిక్కిరిసి నలుగురైదుగురు కలసి వసించేరు నాడు
ఐదారు గదుల మేడ మిద్దెల యందు ఒంటరిగా గడిపేరు జీవనము నేడు

బడుగు జీతాల , ఇరుకు వాటాల యందు జనియించి వికసించెను ప్రేమ బంధాలు నాడు
పెక్కు సంపదల, మేడ మిద్దెల యందు సమసిపోయెను ఆత్మీయతలు నేడు !!!
(11 -04 -2004 )

1 comment:

Lakshmi Ratna said...

మీరు రచించిన "నాడు ....నేడు " కవితలో నాటి దినచర్యకు,నేటి దినచర్యకు తేడా చాల హృద్యంగా చూపించారు.ముఖ్యంగా నాటి దిన చర్య పల్లె వాతావరణాన్ని ప్రతిబిమ్బిస్తీ, నేటి దినచర్య మహా నగరాల్లో ని ఆధునిక జీవితానికి అలవాటు పడ్డ మనిషి దిన చర్యను కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.నగరాల్లో ఉంటూ తీరికే లేని జేవితాన్ని గడుపుతూ,ప్రశాంతత అంటే ఏమిటో మర్చిపోయిన నేటి మనిషిని తిరిగి ఒకసారి ఆ రోజుల్లోకి వెళ్ళి ఆ ప్రశాంతతను చవి చూద్దమనిపించేలా చేసింది మీ కవిత.
రత్న
బెంగుళూరు